National: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..ఐదుగురు నక్సల్స్‌ మృతి

National: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..ఐదుగురు నక్సల్స్‌ మృతి

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా.. ఛత్రా అడవుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ కూంబింగ్ చేపట్టింది. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25లక్షల రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై 25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై 5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లు సమాచారం. నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story