16కోట్ల రూపాయల ఇంజెక్షన్.. పాప దక్కలేదు.. మీ విరాళాలు ఇచ్చేస్తాం..

16కోట్ల రూపాయల ఇంజెక్షన్.. పాప దక్కలేదు.. మీ విరాళాలు ఇచ్చేస్తాం..
నూర్ చికిత్స కోసం విరాళం ఇచ్చిన ప్రజలకు ఇది షాక్ ఇచ్చింది.

అరుదైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ) టైప్ -1 తో బాధపడుతున్న రాజస్తాన్ బికనీర్‌కు చెందిన నూర్ ఫాతిమా అనే ఏడు నెలల బాలిక మంగళవారం ఉదయం కన్నుమూసింది. నూర్ చికిత్స కోసం విరాళం ఇచ్చిన ప్రజలకు ఇది షాక్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి చేసుకున్న16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇస్తే పాప జీవితం మెరుగవుతుందని వైద్యులు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.40 లక్షల రూపాయలు సేకరించారు. కానీ ఇంతలోనే పాప కన్నుమూసింది.

"చిన్నారి మేల్కొన్నప్పుడు, పాలు తీసుకునేటప్పుడు తెల్లవారుజాము 4 గంటల వరకు బాగానే ఉంది. మేము ఉదయం 7 గంటలకు పాపను లేపడానికి ప్రయత్నించినప్పుడు, చిన్నారి లేవట్లేదు. దాంతో పాప ఊపిరి ఆగిపోయిందని గుర్తించాము. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాము. కానీ అప్పటికే మా బంగారు తల్లి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు, "అని శిశువు తండ్రి జిషన్ అహ్మద్ రోదిస్తూ చెప్పారు.

ఇటీవల, హైదరాబాద్‌కు చెందిన బాలుడికి ఎస్‌ఎంఏ -1 చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ సహాయంతో రూ .16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వగా అతడు కోలుకున్నాడని తెలిసి, బేబీ నూర్ కుటుంబం కూడా పాప జీవితం పట్ల ఆశతో ఉన్నారు. కానీ ఇంతలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. "మాకు మద్దతు ఇచ్చి డబ్బును విరాళంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మేము దాదాపు రూ .40 లక్షలు వసూలు చేసాము, నూర్ చికిత్స కోసం మేము సేకరించిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేస్తాము. ఎవరైనా దానిని సేకరించడంలో విఫలమైతే, మిగిలిన డబ్బును పిల్లల చికిత్స కోసం పనిచేసే ట్రస్ట్‌కు బదిలీ చేస్తాము, "అని అహ్మద్ అన్నారు.

ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల శరీరం దిగువ భాగంలో తమ బలాన్ని, కదలికను కోల్పోతారు. ఇందుకోసం రూ .16 కోట్లు ఖర్చయ్యే జోల్జెన్స్మా ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు.

పాప తండ్రి అహ్మద్ చిత్రకారుడు. నెలకు సుమారు 10,000 నుండి 15,000 రూపాయలు సంపాదిస్తాడు. దాంతో కుటుంబ పోషణే కష్టమవుతుంది. ఇంక అంత ఖరీదైన ఇంజెక్షన్ ఎలా ఇప్పించగలడు. మొదట్లో అంత డబ్బును ఏర్పాటు చేయడం అసాధ్యమని భావించాడు. కాని అదే వ్యాధితో బాధపడుతున్న కొంతమంది పిల్లల తల్లిదండ్రులకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా జోల్జెన్స్మా ఇంజెక్షన్ పొంది ఆరోగ్యంగా ఉన్నారన్న సమాచారం తెలుసుకుని తానూ ప్రయత్నించాడు. పొరుగువారు, బంధువులు, కొంతమంది సామాజిక కార్యకర్తల సాయంతో తన కుమార్తె ప్రాణాలను నిలబెట్టాలనుకున్నాడు. కానీ పాప తండ్రి కష్టాన్ని చూడలేకపోయిందేమో తనువు చాలించింది. మీతో నా బంధం తీరిపోయింది నాన్న అనుకుని నిద్రలోనే కన్నుమూసింది.

Tags

Read MoreRead Less
Next Story