నదీ చేప.. సముద్రపు చేప.. ఏది ఆరోగ్యానికి మంచిది
మాంసాహార వంటల్లో చేపలు ఆరోగ్యానికి మంచివని వారానికి రెండు సార్లైనా తినమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సముద్రపు చేపలు చుట్టుపక్కల ఉన్న నీటి నుండి సోడియంను గ్రహించనప్పటికీ, ఉప్పునీటి చేపలు మంచినీటి కన్నా ఎక్కువ రుచిని కలిగి ఉంటాయి. సముద్ర జీవుల్లో కార్బన్ అవశేషాలు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో చేపలను తినడం మనకు ఎంత వరకు మంచిది అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం 1974తో పోలిస్తే చేపల సంతతి 90% నుంచి 66% శాతానికి పడిపోయిందని అంచనా. సముద్ర జలాల్లో పాదరసంతోపాటు ఇతర రసాయనాలు ఎక్కువగా కలుస్తుండటంతో గర్భిణులు, పాలిచ్చే తల్లులు చేపలతో పాటు మరికొన్ని సముద్ర జీవులను తినడం తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అసలు చేపలను తింటే లాభమా, నష్టమా?
పరిశ్రమల వ్యర్ధాల నుంచి వచ్చే పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(పీసీబీ)లను 1980ల నుంచి నిషేధించినా అవి అటు భూమిలోనూ, ఇటు నీటిలోనూ గణనీయంగా చేరుతూనే ఉన్నాయని తేలింది. మనిషి మెదడు నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని వివిధ భాగాల మీద అవి ప్రభావం చూపిస్తాయని నిపుణులు తేల్చారు. పాలు, మంచినీరులాంటి వాటిలో ఈ పీసీబీల ఆనవాళ్లు ఉన్నా, చేపల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
వాటి ప్రభావం నుంచి బైటపడాలంటే అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండటమే ఉత్తమమని ఇంగ్లండ్లోని రోథమాస్టెడ్ రీసెర్చ్కు డైరక్టర్గా వ్యవహరిస్తున్న జోనాథన్ నేపియర్ అన్నారు.
"మనుషులు వేటాడి తినే ప్రాణుల్లో ఈ తరహా ప్రమాదకర అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి'' అన్నారాయన. అందుకే సముద్రాలలో దొరికే చేపలకన్నా, చెరువుల్లో పెంచే చేపలు కొంత వరకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే చేపల చెరువులు కూడా సముద్ర జలాల కాలుష్యానికి చాలా వరకు కారణమవుతున్నాయి. ఈ చెరువుల నుంచి వచ్చే వర్ధ్యాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తుండటంతో ఇక్కడ పుట్టే వ్యాధులన్నీ సముద్రపు చేపల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి.
ఇక నీళ్ల ద్వారా చేపలలో, తద్వారా మనుషుల కడుపులోకి వెళ్లే పాదరసం అవశేషాలు మనిషి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కారక లోహాలలో ఒకటిగా పాదరసానికి పేరుంది. అలాగే డయాబెటీస్, గుండె సంబంధ సమస్యలకు పాదరసం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలలోనూ కొంత శాతం ఉన్నా, 78% పాదరసం చేపల ద్వారానే మనుషుల శరీరంలోకి వస్తుందని పరిశోధనలు తేల్చాయి. అందుకే టూనా, హాలీబట్లాంటి చేపలను తినడం తగ్గించాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డిఎ) సూచించింది. అయితే చేపలలో పాదరసంతోపాటు కొన్ని భార లోహాల అవశేషాల గురించి కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతున్నా, వాటి పరిమాణం ఎక్కువకాలం జీవించి ఉండే చేపలలోనే ఉంటుందని నేపియర్ అన్నారు.
అయితే దీని మీద ఇంకా పరిశోధన జరుగుతోందని ఆయన తెలిపారు. భూమి మీద వేడి పెరుగుతున్న కొద్దీ నీటిలో పాదరసం కలిసే అవకాశాలు కూడా పెరుగుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పునీటి చేపలు పెద్ద ముళ్లు ఉంటాయి. మంచినీటి చేపలు చిన్న ముళ్లు ఉంటాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com