శభాష్ రా పిల్లలు... మీ ఇద్దరికో హాట్సాఫ్!
పొంగల్ కానుకగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రూ.2,500 నగదు, చెరకు, పొంగల్ తయారీ పదార్థాలతో పాటు బట్టలను రేషన్ షాపుల ద్వారా అందించింది. అయితే తమిళనాడులోని కోతమంగళం గ్రామంలోని ఓ 70 ఏళ్ల వృద్ధురాలు సుబ్బలక్ష్మీ.. తన కుమార్తెకు మనోవైకల్యం కావడంతో తానే రేషన్ షాపుకు కాలినడకన బయలుదేరింది.
కొంత దూరం అయితే నడిచింది.. ఆ తర్వాత వృద్ధాప్యంతో ఓపిక లేకపోవడం, పైగా కాలికి గాయం కావడంతో అలసటతో ఒక చెట్టు కింద కూర్చోంది. ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురుచూసింది. కానీ ఒక్కరు రాలే.. కాసేపటికే ఓ ఇద్దరు కవలలు వచ్చి ఆ అవ్వకు సహాయం చేశారు.
స్థానికంగా అక్కడ ఉండే వనిత అనే గృహిణి మార్గమధ్యన వెళ్తూ.. ఈ వృద్ధురాలి అవస్థను గమనించింది. మానవత్వంతో సహాయం చేద్దామని అనుకుంది. తన కవల పిల్లలైన నితిన్, నితేశ్కు ఆ వృద్ధురాలికి సహాయం చేద్దామని చెప్పింది. వాళ్ళు కూడా సరే అన్నారు. దీనితో ఆ వృద్ధురాలుని తోపుడు బండిపై పడుకోబెట్టి రేషన్ షాపునకు తీసుకెళ్లారు.
ఆ రేషన్ షాపు దగ్గర కిందికి దించి రేషన్ పొందేందుకు సహకరించారు. ఆ తర్వాత మళ్ళీ అదే తోపుడు బండిపై పడుకోబెట్టి ఆమెను ఇంటికి చేర్చారు. అలా ఆ వృద్ధురాలి పండగ సంతోషంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆ ఇద్దరు కవల పిల్లలను మెచ్చుకుంటున్నారు. శభాష్ రా పిల్లలు... మీకో హాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com