Sri Lanka : లంకకు తిరిగిరానున్న గొటబాయ రాజపక్స.. ఎప్పుడంటే..?
Srilanka : శ్రీలంక ప్రజల ఆగ్రహానికి గురై దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మళ్లీ లంకలో అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి శ్రీలంక కేబినెట్ ప్రతినిధి గుణవర్దన కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే గొటబాయ రాజపక్స సింగపూర్ నుంచి శ్రీలంకకు వస్తారని ఆయన తెలిపారు. అయితే, కచ్చితంగా ఎప్పుడు వస్తారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.
శ్రీలంక నుంచి జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ ఆయనకు 14 రోజుల తాత్కాలిక వీసాను మంజూరు చేసింది. తాజాగా ఆ వీసాను మరో 14 రోజులు పొడిగించింది.
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్టుకు చెందిన న్యాయవాదులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన రాజపక్సను వెంటనే అరెస్ట్ చేయాలని సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కూడా గుణవర్థన స్పందించారు. అదుపులోకి తీసుకునే పరిస్థితి ఏర్పడితే.. సింగపూర్ ప్రభుత్వం మాజీ అధ్యక్షుడికి ఎలాంటి హాని కలుగకుండా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com