Raja Chari: అంతరిక్ష పరిశోధనల్లో సత్తా చాటుతున్న భారత సంతతి.. ఎవరీ రాజా చారి?
Raja Chari (tv5news.in)
Raja Chari: అంతరిక్ష పరిశోధనల్లో భారత సంతతికి చెందిన ఓ యువకుడు సత్తా చాటుతున్నారు. భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కోసం నాసా ఎంపిక చేసిన 18మంది వ్యోమగాములలో మొదటి బృందంలో ఉన్నారతను. తెలంగాణలోని మహబూబ్నగర్ మూలాలున్న ఆ యువకుడే ఆస్ట్రోనాట్ రాజా చారి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. నాసా, ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ-3 మిషన్ ప్రయోగించింది.
ఫాల్కన్-9 రాకెట్లో దాదాపు 22 గంటల ప్రయాణం తర్వాత నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రూ-3 మిషన్కు కమాండర్గా రాజా చారి వ్యవహరించారు. గడచిన 48 ఏళ్లలో ఇలా ఒక అనుభవం లేని వ్యక్తి నాసా మిషన్కు నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. రాజా చారితో పాటు గతేడాది డిసెంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన ఈ ముగ్గురు.. ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు.
చంద్రునిపై అడుగుపెట్టే అరుదైన గౌరవం పొందబోతున్నారు రాజా చారి. అదే జరిగితే చంద్రునిపై కాలుపెట్టే మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగానూ రాజా చారి రికార్డ్ సృష్టించినట్టే. చంద్రునిపై అన్వేషణ కోసం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక అర్టెమిస్ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. ఇందులోనూ చోటు దక్కించుకున్నారు రాజా చారి. అనుకున్నట్టు జరిగితే.. 2024లో జరిపే అర్టెమిస్ మిషన్ ద్వారా.. రాజాచారి చంద్రునిపై అడుగు పెడతారు.
ఆర్టెమిస్ టీమ్లోని ఒకరికి కుజ గ్రహంపై వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మిషన్లలో రాజాచారి దేనికి ఎంపికైనా అది తెలుగువారికి గర్వకారణం. భారతీయ అమెరికన్ అయిన రాజాచారి.. అమెరికన్ ఎయిర్ఫోర్స్లో కర్నల్ హోదాలో ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాస చారి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారు.
రాజా చారి తాత మహబూబ్నగర్లో ఉండేవారు. ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా చేశారు. జీవనోపాధికి అమెరికాకు వెళ్లిన రాజా చారి తండ్రి శ్రీనివాస చారి.. అమెరికాకు చెందిన మహిళలను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. వారికి రాజాచారి జన్మించారు. అమెరికాలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి, యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు రాజా చారి.
ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ కోర్స్ పూర్తి చేశారు. అంతరిక్షయానంపై ఆసక్తి పెంచుకున్న రాజాచారి.. 2017లో నాసా ఆస్ట్రోనాట్ గ్రూప్ 22 మిషన్కు దరఖాస్తు చేశారు. ఈ మిషన్కు 18వేల 300 అప్లికేషన్లు రాగా.. కేవలం 12 మందిని నాసా ఎంపిక చేసింది. వారిలో రాజా చారి ఒకరు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com