గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
పంద్రాగస్టు వేడుకలకు తెలంగాణలో గొల్కొండ కోట ముస్తాబైంది. ఇవాళ సీఎం కేసీఆర్ గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా పరేడ్ గ్రౌండ్స్ కు సైనిక అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడ్నుంచి గొల్కొండ చేరుకొని పదిగంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లుచేశాయి. పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా చేసి ప్రభుత్వం నుంచి పాసులు జారీ చేశారు. పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. ఎక్కడా ట్రాఫిక్ అంతరాయాలేకుండా చర్యలు తీసుకున్నారు.
జాతీయత భావం, తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా గోల్కండ కోటలో ఏర్పాట్లు చేశారు. అయితే.. కశ్మీర్ పరిణామాలు..నిఘా విభాగాల హెచ్చరికలతో ఈసారి భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. కోటలో ప్రతీ ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేశారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. గోల్కొండ కోట, పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్బ్యాగ్లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్బాటిళ్లు తీసుకురావడం నిషేధించారు.
మరోవైపు... హైదరాబాద్ పలు చారిత్రాత్మక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగర వ్యాప్తంగా ఇప్పటికే మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రభుత్వం కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, స్టాల్స్ అన్ని అందంగా ముస్తాబయ్యాయి. నగరంలో ఎక్కడ చూసినా విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ, సచివాలయాలు ధగధగా మెరిసిపోతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com