టీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్న బీజేపీ.. త్వరలోనే భాజాపాలోకి కీలక నేతలు
రాష్ట్రంలో పార్టీలు మరోమారు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో మునిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు క్షేత్ర స్థాయిలో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పట్టుకోసం తాపత్రయ పడుతున్న బీజేపీ కూడా మునిసిపాలిటీల్లో తాము మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామంటోంది...
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటుతో సరిపెట్టుకున్న బీజేపీ తెలంగాణలో ఘోరపరాజయం మూటగట్టుకుంది. ఇక ఆ పార్టీ తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపదన్న అభిప్రాయానికి వచ్చారు. ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా పుంజుకుంది . ఎవరూ ఊహించని విదంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకుంది. దీంతో పార్టీ ఎదుగుదలపై కాస్త నమ్మకం ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా ఇతర పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రభావం కచ్చితంగా రాబోయే మునిపల్ ఎన్నికల్లో ఉంటుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి కొంత పట్టు ఉంది. గతంలో కేవలం 8శాతం ఉన్న ఓటింగ్ శాతం లోక్ సభ ఎన్నికలకు 18శాతానికి చేరింది . ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ఓటింగ్ శాతం బీజేపీకి పెరగడంతో మునిపిల్ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు ఈ నెల 6న ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా పర్యటన కూడా ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. సభ్యత్వ నమోదు కోసం వచ్చిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ తో ఇక ఎటువంటి సత్ సంబందాలు ఉండబోవని... ఒంటరిగానే పార్టీ ప్రజాసమస్యలపై పోరాడాలని పిలుపునివ్వడంతో పాటు తాను కూడా తెలంగాణలో ముమ్మరంగా పర్యటిస్తానని తెలిపారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం అయిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పార్టీ ముఖ్యనేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి కూడా పార్టీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని.. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. కొన్ని మునిసిపాలిటీలను క్లస్టర్లుగా విభజించి నేతలను ఇన్ చార్జ్ లుగా నియమించనుంది. మునిసిపాలిటీలలో భాగ్ ప్రముఖ్ లను నియమించుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా .. క్షేత్ర స్థాయిలో పార్టీ విజయావకావాశాలు మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం ఉదృతం చేయాలని చూస్తోంది. రెండు రోజుల్లో కమిటీలు ఏర్పాటు ప్రక్రియ ను పూర్తి చేసుకుని నోటిఫికేషన్ వచ్చే నాటికి సర్వసన్నద్దంగా ఉడాలని భావిస్తోంది.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ కేడర్ కు సూచించారు. నెలకు ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తారని అమిత్ షా చెప్పడంతో ఈ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది ఆ పార్టీ. దీంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి కూడా ఇతర పార్టీల నుండి స్పందన బాగా ఉండటంతో బలమైన నేతలు వస్తే వారిని కూడా ఎన్నికల బరిలో నిలబెట్టాలంటూ అమిసా రాష్ట్ర నేతలకు సూచించారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో బలమైన నేతలు ఎవరన్న దానిపై దృష్టి సారించింది బీజేపీ .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com