నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు

నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ప‌లు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయి

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ప‌లు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌కు ప్రజ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. బ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఉక్కపోత‌తో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంట‌ల నుంచే ఎండ దంచికొడుతోంది. హైదరాబాద్, రాజమండ్రిల్లో రికార్డుస్థాయిలో 49 డిగ్రీలు, ఏలూరులో 48 డిగ్రీలు, కొత్తగూడెం, మిర్యాలగూడలో 47 డిగ్రీల‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మిగ‌తా ప్రాంతాల్లోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి.

వ‌డ‌దెబ్బకు తెలంగాణ‌లో ముగ్గురు, ఏపీలో ఇద్దరు మృతి చెందారు. మ‌రో మూడు రోజుల పాటు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, పిల్లల్ని బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వ‌ర‌కు చ‌ల్లని ప్రదేశాల్లో ఉండాల‌ని సూచిస్తున్నారు. వ‌డ‌దెబ్బకు గురి కాకుండా మ‌జ్జిగ‌, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

నైరుతీ రుతుప‌వ‌నాలు జూన్ 4న కేర‌ళ‌లోకి ప్రవేశించనున్నాయి. నాలుగు రోజుల ఆల‌స్యంగా రుతుప‌వ‌నాలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

Tags

Read MoreRead Less
Next Story