Lok Sabha Polls: ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు..

Lok Sabha Polls: ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు..
ఓట్ల కోసం రాజకీయ నేతల క్యూ

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల అభ్యర్ధులు ఓట్ల వేట అప్పుడే మొదలెట్టారు. ఈ క్రమంలో అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని నేపాలీ పామ్‌ గ్రామం పేరు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఎలక్షన్స్‌గా మోగిపోతోంది. అంత స్పెషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? ఈ ఊరిలో ప్రపంచంలోనే అతి పె.. ద్ద.. కుటుంబం ఉంది మరీ. ఆ కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఒక్క కుటుంబాన్ని బుట్టలో వేసుకుంటే చాలు ఓట్ల పంట పండుతుందని స్థానిక అభ్యర్థులు ఈ ఊరికి వరుస కట్టారు.

నిజానికి ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని నేపాలీ పామ్‌ గ్రామంలో రాన్‌ బహదూర్ థాపా అనే గోర్ఖా స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆయనకు ఐదుగురు భార్యలు. 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు సంతానం. 1997లో రాన్‌ బహదూర్ మరణించాడు. క్రమంగా అతని కుటుంబం ఆ ఊర్లో విస్తరించింది. కుటుంబం పెరిగే కొద్దీ మెరుగైన జీవనం కోసం వేరు వేరు కాపురాలు పెట్టారు. అలా ఒకే వంశం నుంచి ఏకంగా ఓ గ్రామమే ఏర్పడింది. వారి ఊరిలో ప్రస్తుతం 300 కుటుంబాలు ఉన్నాయి. వీరికి 65 మంది మనవళ్లు, 70 మంది మనవరాళ్లు ఉన్నారు. ఈ నేపాలీ పామ్ గ్రామంలో ఇతర కుటుంబాలు లేవు. రాన్‌ బహదూర్ థాపాలో సంతానంలో ఇద్దరు మినహా వివాహిత కుమార్తెలతో సహా అందరూ ఇదే గ్రామంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం 2,500 మంది సభ్యులు ఆ కుటుంబంలో ఉన్నారు. వారిలో వయోజన ఓటర్ల సంఖ్య 1,200 మంది. కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే వీరంతా ఓటు వేస్తారు. దీంతో తేజ్‌పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఈ గ్రామ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా రాన్ బహదూర్ పెద్ద కుమారుడు టిల్ బహదూర్‌ను సంప్రదిస్తూ ఉంటారు.

అస్సాంలోని రాన్ బహదూర్ థాపా కుటుంబం మాదిరిగానే మిజోరాంలో జియోనా చనా కుటుంబం కూడా చాలా ఫేమస్‌. బహదూర్ ఐదుసార్లు వివాహం చేసుకుంటే.. చానా 38 సార్లు వివాహం చేసుకున్నాడు. చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 36 మంది మనవరాళ్లు ఉన్నారు. చానా 2017లో 76 ఏళ్ల వయసులో మరణించాడు. చానా కుటుంబంలో 199 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story