Anantnag Encounter: ముగిసిన ఎన్‍కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

Anantnag Encounter:  ముగిసిన ఎన్‍కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
ఏడు రోజుల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు ముగింపు..

జమ్మూ‌కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత మంగళవారం సాయంత్రం మొదలైన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఏడు రోజుల తర్వాత ముగిసింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగిన ఈ సుదీర్ఘ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ఉన్నారు. ఈ విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉజైర్ ఖాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా.. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉందని, అయితే, ఇప్పటికీ ఉగ్రవాదులకోసం గాలింపు జరుగుతోందని, ప్రజలు అటువైపుగా వెళ్లొద్దని విజయ్ కుమార్ కోరారు.


అనంతనాగ్ జిల్లాలోని కొకెరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూక రహస్య ప్రాంతంలో దాగిఉన్నట్లు సమాచారం రావడంతో మరుసటిరోజు ఉదయం ఆ ప్రాంతానికి కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది. వీరిని గమనించి ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ గల్లంతయింది. సెప్టెంబర్ 18 ఆ జవాను భౌతికకాయాన్ని పోలీసులు కనుగొన్నారు. అతడు పంజాబ్‌కు చెందిన ప్రదీప్‌ కుమార్‌ అని ఆర్మీ అధికారులు చెప్పారు.


హాటముల్ గాడోల్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి గత బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ సందర్భంగా అదృశ్యమైన సైనికుడిదిగా గుర్తించారు. మరొకరి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.


‘సెర్చ్ ఆపరేషన్ చేపట్టాల్సిన ప్రాంతం చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.. పేలని మందుగుండు, షెల్స్ చాలా ఉండొచ్చు.. వాటిని నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.. ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం ఉందని, ‘మూడో మృతదేహం ఎక్కడో ఉండే అవకాశం ఉంది.. సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది’ అని విజయ్ కుమార్ చెప్పారు.

ఇదిలాఉంటే.. జమ్మూకశ్మీర్ లోని కిస్తవాడ్ కు చెందిన 13 మంది ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్నట్లు తెలిపారు. 30 రోజుల్లో వీరు తమ ముందు హాజరుకాకపోతే ఆస్తులు జప్తు ప్రక్రియనుప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నోటీసులు సైతం అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story