Kerala: ఆకలికి తాళలేక పిల్లి మాంసం పీక్కుతిన్న యువకుడు

Kerala: ఆకలికి తాళలేక పిల్లి మాంసం పీక్కుతిన్న యువకుడు
ఐదు రోజులుగా తిండి లేక..

కేరళలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొన్నిరోజుల నుంచి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడు.. ఏకంగా ఓ చనిపోయిన పిల్లిని పీక్కుతింటూ కనిపించాడు. అతడ్ని చూసి అక్కడి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండ్‌లో ఈ దిగ్ర్భాంతికర ఘటన వెలుగుచూసింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీనా అక్కడికి చేరుకున్నారు. అతనికి ఆహారం అందించి.. ఆ తర్వాత వివరాలు సేకరించారు. అతడ్ని అసోంలోని ధుబరీ జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం డిగ్రీ చదువుతోన్న ఆ యువకుడు గత డిసెంబరులో ఇంట్లోవారికి చెప్పాపెట్టకుండా రైలెక్కి కేరళకు వచ్చేశాడు. తన వద్ద ఉన్న కాస్త డబ్బులు అయిపోవడంతో ఐదు రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో కుట్టిపురం బస్టాండ్ వద్ద చనిపోయిన ఓ పిల్లి కనిపించడంతో దాని మాంసాన్ని పీక్కు తింటూ స్థానికుల కంటబడ్డాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి సమాచారం అందించారు. ఆ యువకుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు.

యువకుడు ఇచ్చిన సమాచారంతో చెన్నైలోని అతడి సోదరుడ్ని పోలీసులు సంప్రదించారు. ‘చెన్నైలోని పనిచేస్తోన్న సోదరుడి మొబైల్ నెంబరును ఇచ్చాడు.. ఆ నెంబరుకు ఫోన్ చేసి అతడు ఇచ్చిన సమాచారం సరైందేనని నిర్దారించాం.. ప్రస్తుతం త్రిసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అతడికి ఎటువంటి శారీరక, మానసిక అనారోగ్యాలు లేవు.. కుటుంబసభ్యులు ఇక్కడకు వచ్చిన తర్వాత అతడ్ని అప్పగిస్తాం’ అని పోలీసులు తెలిపారు. అయితే, అతడు ఇంటిలో చెప్పకుండా కేరళకు ఎందుకు వచ్చాడనేది మాత్రం తెలియరాలేదు.

Tags

Read MoreRead Less
Next Story