Fake MBA Alert: ‘10 రోజుల్లో ఎంబీఏ’పై జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపుపొందిన డిగ్రీ ప్రోగ్రాముల మాదిరిగానే ఆన్లైన్ కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అలాంటివాటిలో ‘10 రోజుల ఎంబీఏ’ అనే అంశం తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ తెలిపారు. ప్రాంతీయ, రాష్ట్ర, కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయాలు, లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. ఆన్లైన్లో డిగ్రీని అందించాలనుకునే ఏ ఉన్నత విద్యా సంస్థ అయినా తప్పకుండా యూజీసీ అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా అనుమతి పొందిన విద్యాసంస్థలు వాటి కోర్సుల వివరాలను యూజీసీ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఆన్లైన్లో కోర్సులకు దరఖాస్తులు చేసుకునే ముందు వాటి చెల్లుబాటును నిర్ధారించుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com