Jodo Nyay Yatra: రాహుల్‌గాంధీ రెండో రోజు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

Jodo Nyay Yatra: రాహుల్‌గాంధీ రెండో రోజు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర
కళాపహర్‌, కంగ్‌పోప్కి నుంచి ప్రారంభం

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కళాపహర్‌, కంగ్‌పోప్కి నుంచి రెండో రోజు యాత్ర మొదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 నియోజకవర్గాల మీదుగా భారత తూర్పు తీరం నుంచి పడమర తీరం వరకు సాగే ఈ యాత్రను రాహుల్‌గాంధీ ఆదివారం ఘనంగా మొదలుపెట్టారు. మణిపూర్‌లోని తౌబాల్‌ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.

దేశంలో సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమక్షంలోమణిపుర్‌ నుంచి ముంబయి వరకు సాగే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపుర్‌ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాని మోదీ... ఓట్ల కోసం మాత్రం వస్తారని ఆరోపించారు. సముద్రం వద్ద విహరించేందుకు ప్రధానికి సమయం ఉంటుంది కానీ, మణిపుర్‌ ప్రజల గోడు వినేందుకు మాత్రం ఖాళీ ఉండదని మండిపడ్డారు. భాజపా మతం, రాజకీయాలను మిళితం చేస్తోందనిమతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే విమర్శించారు.

ప్రజల మాటవినేందుకు,వారితో మమేకమయ్యేందుకు తనకు మరో అవకాశం లభించిందని రాహుల్‌గాంధీ అన్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను. ప్రధాని ఇంతవరకూ సందర్శించలేదన్న ఆయన.ఇది భారత్‌లో అంతర్భాగం కాదని భావిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. మణిపుర్ ప్రజల బాధనుతాము అర్థం చేసుకున్నామని తెలిపారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వారి బాధలు వినేందుకే యాత్ర చేపట్టినట్లు వివరించారు.

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్‌ నుంచి ప్రారంభమై ముంబయిలో ముగుస్తుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా..భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగుతుంది.ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభమైన యాత్ర..ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రోజుకు రెండుసార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్‌గాంధీ మాట్లాడుతారు. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత.. పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story