BJP 2024 Election Plan : బీజేపీ ఎన్నికల ఎజెండా ప్లాన్

BJP 2024 Election Plan :  బీజేపీ ఎన్నికల ఎజెండా ప్లాన్
మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు

వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు సమరానికి ముందు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీసహా ప్రధాన పార్టీలన్నీ సెమీస్‌గా భావించాయి. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు ...కాంగ్రెస్‌ పాలనలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాషాయ జెండా ఎగురవేశారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా శాసనసభ సమరంలో సర్వశక్తులు ఒడ్డి మూడు రాష్ట్రాల్లో బంపర్‌ మెజార్టీ సాధించిన భాజపా....ఆయా రాష్ట్రాల సీఎంల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం వారం రోజులకుపైగా తీవ్ర కసరత్తు చేసింది. 3రాష్ట్రాల్లో సీనియర్‌ నేతలను పక్కన పెట్టిన కమలం పార్టీ పెద్దలు....ఎవరి అంచనాలకు అందకుండా సీఎంగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణల్లో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పక్కనపెట్టి....మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌కు పాలనా పగ్గాలు అప్పగించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురితోపాటు ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే....అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో ఆ వర్గానికి చెందినవారు 32 శాతంగా ఉన్నారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కులగణన డిమాండ్‌కు కౌంటర్‌గా OBCని ముఖ్యమంత్రిని చేయవచ్చు. కానీ గిరిజన ప్రాబల్యమున్న స్థానాల్లో bjp అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో జయభేరి మోగించారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపకరిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో 163స్థానాలతో బంపర్‌ మెజార్టీ సాధించిన భాజపాకు సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయటం...కత్తి మీద సాములా మారింది. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు....పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎంగా యాదవ్‌ వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌ను ఎంపిక చేసిన భాజపా అధిష్ఠానం ....ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించింది. దళిత వర్గం నుంచి జగదీశ్‌ దేవ్దాకు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి రాజేంద్ర శుక్లాకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టింది. ఠాకూర్‌వర్గానికి చెందిన నరేంద్రసింగ్‌ తోమర్‌ను స్పీకర్‌గా ప్రకటించారు.

రాజస్థాన్‌లో బ్రాహ్మణ సామాజికవర్గం ఆ రాష్ట్ర జనాభాలో 7శాతంగా ఉంది. అందుకే ఆ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను భాజపా అధినాయకత్వం సీఎంగా ఎంపిక చేసింది. ఆయన తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటికీ సంస్థాగతంగా పార్టీ బలపడటంలో కీలకంగా వ్యవహరించారు. భాజపా రాష్ట్ర శాఖ కార్యదర్శిగా నాలుగు సార్లు పనిచేశారు. సంఘ్‌తోనూ గట్టి అనుబంధం ఉండటం కూడా శర్మకు కలిసివచ్చింది. రాజస్థాన్‌లో మిగితా సామాజికవర్గాలు నిరాశ చెందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలనాథులు...ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఒకరు రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన దియా కుమారిని, మరొకరు దళితవర్గానికి చెందిన ప్రేమ్‌చంద్‌ బైర్వాను ఎంపికచేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది

Tags

Read MoreRead Less
Next Story