Central Election Commission: కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

Central Election Commission:  కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు
త‌ప్పుడు హామీలిస్తే వేటు, ప్రార్ధ‌న మందిరాల‌లో ప్ర‌చారం నిషేధం.. ఇంకా..

ఎన్నికల ప్రక్రియలో చేపట్టాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక సూచనలు జారీచేసింది. నగదు, అక్రమ మద్యం రవాణా, ఉచితాల పంపిణీ వంటి అంశాలపై నిఘా పెట్టాల్సిందిగా సూచనలు ఇచ్చింది. ప్రజలు ఎన్నికల అక్రమాలపై... సీ-విజిల్‌ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని... ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోపు చర్యలు ఉంటాయని ఈసీ పేర్కొంది .

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఐటీ, కస్టమ్స్‌ లాంటి కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు... E.C. ప్రత్యేకమైన సూచనలు జారీచేసింది. ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమలును పటిష్ఠంగా నిర్వహించడంతోపాటు... నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల సమయంలో... మద్యం, నగదు, ఉచితాల పంపిణీ, మాదకద్రవ్యాల సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చే అక్రమ మద్యం విషయంలోనూ నిశిత దృష్టి పెట్టాలని... కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లోని మద్యం కింగ్‌ పిన్‌ల పైనా నిఘా ఉంచాలని సూచించింది. నగదు చలామణీతోపాటు... ఆన్‌లైన్‌లో నగదు బదిలీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌ వాలెట్‌లను భర్తీ చేయడం, క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌లు వంటివాటిపై నిఘా పెట్టాలని నిర్దేశించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించిన పనివేళల్లో మాత్రమే నగదు రవాణా వాహనాలను అనుమతించాలని పేర్కొంది. ప్రత్యేకించి విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిపాడ్‌ల వద్ద కూడా సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో నిఘా పెట్టాలని స్పష్టం చేసింది.

అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మాత్రమే 50 లీఫ్‌లెట్స్‌ ఉన్న... 4 వ్యక్తిగతం కాని చెక్‌ పుస్తకాలు మంజూరు చేయవచ్చని... బ్యాంకులకు ఈసీ సూచించింది. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం పంచిపెట్టే సున్నితమైన వస్తువులకు సంబంధించి... కొనుగోళ్లపైనా దృష్టి పెట్టాలని సూచించింది. రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల ఉండే గోదాములపైనా నిఘా ఉంచాలని ఆదేశించింది. పోలీసు, ఎక్సైజ్‌, రవాణా విభాగాలతో సమన్వయం చేసుకొని... నిఘా పెట్టాలని సూచించింది. అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు ఇచ్చేలా ఎన్నికల వాతావరణాన్ని కల్పించాలని... పక్షపాతం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని.. కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాపై చేసే ఫిర్యాదుల విషయంలో విచారణ చేసి వాటి పరిష్కారపై వివరాలు తెలియచేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో దురుద్దేశపూర్వకమైన వ్యవహారాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈసీ పేర్కొంది.

ఎన్నికల ప్రక్రియలో... ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. EVMలను కేవలం అధికారిక వాహనాల్లోనే తరలించాలని.. వాటికి GPS ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story