Rahul Gandhi: రాహుల్‌‌గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు..

Rahul Gandhi: రాహుల్‌‌గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు..
రాహుల్​కు షాక్- 'మోదీ అశుభం' వ్యాఖ్యలపై వివరణ

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని అశుభం, పిక్‌పాకెట్‌, రుణమాఫీ వంటి మాటలు వాడిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. శనివారం సాయంత్రంకల్లా దీనికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక సీనియర్‌ నేత ఇలాంటి భాష ఉపయోగించడం అనుచితం అంటూ ఆరోపించిన భాజపా ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ ప్రత్యర్థులపై నిరూపితంకానీ ఆరోపణలు చేయరాదు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్‌ గాంధీ ఈ ఆరోపణలు చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పనౌటీ మోదీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈసీ. పనౌటీ పద ప్రయోగం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, జేబుదొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం కోరింది ఈసీ. నవంబర్ 25 సాయంత్రం 6గంటలలోపు సమాధానం ఇవ్వాలని సూచించింది. నవంబర్ 22వ తేదీన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్, మరో నేత ఓం పాఠక్ సహా ప్రతినిధి బృందం రాహుల్ గాంధీ ప్రకటనను అవమానకరమైనదిగా పేర్కొంటూ ఈసీని ఆశ్రయించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయని, వారి ప్రవర్తన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఎన్నికల చట్టాలు, మోడల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలతోపాటు విలువలకు గౌరవం లేదని తెలిపారు.

వాస్తవానికి, ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పనౌటీ అనే పదాన్ని ఉపయోగించారు. నవంబర్ 21వ తేదీన రాజస్థాన్‌లోని బలోత్రాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్‌ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన వాళ్లలో ఓ అపశకునం ఉన్నదని, ఆ అపశకునం వల్లనే భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయిందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story