Bhupesh Singh Baghel: కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి.

Bhupesh Singh Baghel: కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి.
ప్రజలు క్షేమం కోసమే అన్న సీఎం బఘేల్

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలను ఆకర్షించేందుకు అనేక రకాల హామీలను పార్టీలు గుప్పిస్తున్నాయి. ఇక రకరకాల ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే తొలి దశ పోలింగ్ ఈ నెల 7 వ తేదీన పూర్తయింది. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 17 వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో విజయంపై అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది

దీపావళి వేళ ఛత్తీస్ గఢ్ లో గౌరా గౌరీ మాతను పూజించడాన్ని అక్కడి ప్రజలు అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. అంతేకాదు, గౌరా గౌరీ పూజ నిర్వహించి, కొరడా దెబ్బలు తింటారు. తాజాగా, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బఘేల్ కూడా గౌరీ మాత పూజలో పాల్గొన్నారు. దీపావళి పండగ సమయంలో గోండు తెగ ప్రజలు ఈ గౌరా గౌరీ పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో భాంగా ముందుగా మొదట నది ఒడ్డుకు వెళ్లి మట్టిని తీసుకుని వస్తారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఒకరి ఇంట్లో శివుడిని.. మరొకరి ఇంట్లో పార్వతీ దేవిని ఆ మట్టితో తయారు చేస్తారు. ఆ తర్వాత శివపార్వతుల కల్యాణం జరుపుతారు. ఈ సంప్రదాయాన్ని 'సోటా' అని ఛత్తీస్‌గఢ్‌లో పిలుస్తారు.

దుర్గ్ జిల్లాలోని జంజ్గీర్ గ్రామంలో జరిగిన గౌరా గౌరీ పూజకు హాజరైన సీఎం బఘేల్ ఎంతో భక్తిప్రపత్తులతో అమ్మవారిని పూజించారు. సంప్రదాయాన్ని అనుసరించి చేతిపై కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నానని వెల్లడించారు. ఈ పండుగ అందరూ సమానమేనని చాటుతుందని, అమ్మవారి ముందు అందరూ ఒక్కటేనని అన్నారు. ఇది సర్వ మానవ సమానత్వాన్ని సూచించే పండుగ అని సీఎం బఘేల్ వివరించారు. ఇక ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 7 వ తేదీన 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 70 స్థానాలకు నవంబర్17 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story