దూసుకొస్తోన్న'బురేవి' తుఫాన్

దూసుకొస్తోన్నబురేవి తుఫాన్

నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మరువక ముందే...బంగాళాఖాతంలో మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం ఇది శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఇది నైరుతి దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని.. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమైలీకు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 4న తమిళనాడులోని కన్యాకుమారి - పాంబర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

తుఫానుగా మారిన తర్వాత ఇవాళ శ్రీలంక వద్ద తీరాన్ని తాకనుంది. ఆ తరువాత దాదాపు పశ్చిమ దిశగా మళ్లి.. రేపు కొమొరిన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది..ఈ తుఫాన్‌కు 'బురేవి'గా నామకరణం చేశారు. తమిళనాడు, కేరళకు రెడ్ అలర్ట్, దక్షిణ కోస్తాంధ్ర, లక్షదీప్‌లకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు80 - వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. బురేవి తుఫాన్ ప్రభావంతో ఇవాళ, రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలోని దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం కన్యాకుమారి, తిరునాల్వేలి, తూతుకూడి, టెంకాసీ, రామనాథపురం, శివగంగయ్ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story