' స్టే' విధించిన కేసులపై 6నెలల్లోపు నిర్ణయం తీసుకోండి : సుప్రీం కోర్టు

 స్టే విధించిన కేసులపై 6నెలల్లోపు నిర్ణయం తీసుకోండి : సుప్రీం కోర్టు
ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై సుప్రీం కోర్టు వేగం పెంచింది. ఈ మేరకు జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం లిఖితపూర్వక మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది..

ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై సుప్రీం కోర్టు వేగం పెంచింది. ఈ మేరకు జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం లిఖితపూర్వక మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. నేతలపై ఉన్న కేసుల విషయంలో స్టే విధించిన చోట్ల 6నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత స్టే చెల్లుబాటు కాదన్న ఆదేశాలను అన్నికోర్టులూ పాటించాలంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సాక్షుల రక్షణ పథకం-2018ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని.. సాక్షుల భద్రతాంశాలపై ట్రయల్‌ కోర్టులే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దోషులగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాలన్న మధ్యంతర అప్లికేషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి మరో వారం గడువు ఇచ్చింది. ఈ అంశంపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్ల అమలు, సమన్ల అందజేతకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారుల నియామకం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోని పెండింగ్ కేసుల వివరాలు తదుపరి విచారణ తేదీ నాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లా కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ గది ఏర్పాటుకు అయ్యే ఖర్చు భరించే అంశంపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా... తమిళనాడు హైకోర్టు లేవనెత్తిన అంశం సరిచేసుకునేందుకు సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. వారెంట్ల అమలుపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని బెంగాల్‌, కేరళ ప్రభుత్వాలు, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కర్నాటక హైకోర్టుకు స్పష్టంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story