Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు..

Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు..
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోతున్న కొండ

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు గురువారం సాయంత్రం తెరిచారు. ఇక రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు.

శుక్రవారం నుంచి రెండు నెలలపాటు దర్శనాలు కొనసాగనున్నాయి. దీంతో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది యాత్రికులు, భక్తులు శబరికి తరలివస్తున్నారు. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాది దక్షిణ భారతదేశం నుంచి వచ్చే భక్తులతోనే శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు శబరికి క్యూ కట్టారు.


ప్రారంభ రోజు వేడుకల్లో కేరళ దేవస్వామ్ మంత్రి కె రాధాకృష్ణన్, ఎమ్మెల్యేలు ప్రమోద్ నారాయణ్, కెయు జినీష్ కుమార్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ)కి కొత్తగా నియమితులైన పీఎస్ ప్రశాంత్ కూడా శుక్రవారం తెల్లవారుజామున ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం సన్నిధానంలో ఉన్న అన్నదాన మండపంలో మంత్రి రాధాకృష్ణన్‌ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా శబరిమల యాత్ర సందర్భంగా గురువారం ఆలయ తంత్రి (ప్రధాన అర్చకుడు) మహేశ్ మోహనరావు ఆధ్వర్యంలో గర్భగుడిని తెరిచారు. మణికంఠుడి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్‌ క్యూ కంట్రోల్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story