Jaishankar: కెనడాను కడిగేసిన జైశంకర్‌

Jaishankar:  కెనడాను కడిగేసిన జైశంకర్‌
ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై.. భారత్ , కెనడా మధ్య నెలకొన్న విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్రపై..నిర్దిష్టమైన సమాచారం ఉంటే దాన్ని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. ఐరాస సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన జైశంకర్ వాషింగ్టన్ లో భారత విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కెనడా ప్రభుత్వంతో భారత్ చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. అతివాదం, ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరే అతి పెద్ద సమస్య అని జైశంకర్ స్పష్టంచేశారు. రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లు, ఇతర కారణాలతో కెనడా అలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్ లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు కెనడాలో ఉన్నారన్న జైశంకర్ వారిని అప్పగించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినా అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


ఉగ్రవాదం, అతివాదంపై కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత్‌ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటోందని జై శంకర్ మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి, ఒత్తిళ్లు, ఇతర కారణాలతో కెనడా ఉగ్రవాదం పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో నేరాలు, దాడులకు పాల్పడిన వారు కెనడాలో ఉన్నారని వారిని అప్పగించాలని ఎన్నోసార్లు కెనడాను కోరినా ఆ దేశం పట్టనట్టు వ్యవహరించిందని ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నవారు కొందరు కెనడాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది నిజమని జైశంకర్‌ స్పష్టం చేశారు.


ఇక కెనడాలో భారత దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగాయని.. భారత ఉద్యోగులను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని జై శంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది సాధారణ పరిస్థితిగా పరిగణించాలా.. ఇలాంటి పరిస్థితే మిగితా దేశాలకూ వస్తే వారు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దౌత్యవేత్తలపై బెదిరింపులు ఏ మాత్రం ఉపేక్షించేవి కావని తేల్చి చెప్పారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించి భారత్‌కు ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. స్వేచ్ఛ పేరుతో హింస జరిగితే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్లేని జైశంకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story