Farmers Protest : డిమాండ్ లు సాధించేవరకు తగ్గేదే లే..

Farmers Protest : డిమాండ్ లు సాధించేవరకు తగ్గేదే లే..
రేపు గ్రామీణ భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్‌ మోర్చా

ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. మరోవైపు నిరసన కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. శంభు సరిహద్దులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు. హరియాణా పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని పేర్కొన్నారు. పంజాబ్‌-హరియాణా శంభు సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

హరియాణా జింద్‌ జిల్లాలోని సింగ్‌వాలా-ఖనౌరీ సరిహద్దు వద్ద కూడా ఇదే తరహా ప్రతిష్టంభన నెలకొని ఉంది. ట్రాక్టర్లపై పంజాబ్‌ నుంచి వచ్చిన రైతులను దిల్లీకి వెళ్లకుండా హరియాణా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంకా పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు శంభు సరిహద్దుకు తరలివస్తూనే ఉన్నారు. పంజాబ్‌ వైపు జాతీయ రహదారిపై ఈ ట్రాక్టర్లు భారీగా క్యూ కట్టి ఉన్నాయి. పంజాబ్‌ సరిహద్దు దాటి హరియాణాలోకి ప్రవేశించేందుకు రైతులు మరోసారి యత్నించగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మంగళవారం రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా పదుల సంఖ్యలో గాయపడ్డారు.


రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చే రహదారులను తెరిచి ఉంచిన దిల్లీపోలీసులు... హరియాణా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంల్లో మాత్రం పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సింఘ్‌, టిక్రీ సరిహద్దుల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి.


మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్‌ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని హరియాణా పోలీసులకు తేల్చి చెప్పారు. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో సీనియర్‌ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌ ముండా సమావేశమయ్యారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌ రైతు సమస్యలపై అర్జున్‌ ముండాతో చర్చించినట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్‌ చేస్తుండగా అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాల్సి ఉందని తొందరపడి దీనిపై ఒక నిర్ణయానికి రాలేమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story