ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ క్రీడాకారుల మద్దతు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు కొందరు మాజీ క్రీడాకారులు మద్దతు ప్రకటించారు. అన్నదాతలపై వాటర్ కెనాన్, బాష్పవాయు గోళాల ప్రయోగాన్ని వ్యతిరేకించారు. దీనికి నిరసనగా తమకు అందించిన పద్మశ్రీ, అర్జున అవార్డులను తిరిగిచ్చేస్తామని మాజీ రెజ్లర్ కర్తార్సింగ్, బాస్కెట్ బాల్ ఆటగాడు సజ్జన్ సింగ్ చీమా, హాకీ క్రీడాకారుడు రాజ్బీర్ కౌర్ హెచ్చరించారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్ బయట పురస్కారాలను వదిలేస్తామని పేర్కొన్నారు.
రైతులు కొన్ని నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ఒక్క చోట హింస జరగలేదని, కానీ వారు దిల్లీకి వెళ్తుంటే వాటర్ కెనాన్లు, భాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెద్దల తలపాగాలు కిందపడితే ఈ పురస్కారాలతో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. తామంతా రైతులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తమకు వచ్చిన అవార్డులు అవసరం లేదని, వీటిని తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రైతులే చట్టాలు వద్దంటుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు రుద్దుతోందో అర్థం కావడం లేదన్నారు క్రీడాకారులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com