Rajasthan : కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్..

Rajasthan :  కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్..
క్యాబిన్‌లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు

రాజస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. డిసెంబర్ 9న కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఫూల్‌చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9న రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లో కూర్చుంది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్‌చంద్ మీనా వివరించారు.

ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్‌చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు.

2012లో ఇదే నెలలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనకు, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఘటనకు ఈ ఘటనకు చాలా పోలిక ఉంది. కదులుతున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి కొన్ని నెలల తర్వాత ఆమె మృతి చెందింది.

Tags

Read MoreRead Less
Next Story