Farmers Protest : ఫిబ్రవరి 13న రైతుల ఛలో ఢిల్లీ

Farmers Protest : ఫిబ్రవరి 13న రైతుల ఛలో ఢిల్లీ
3 రోజుల పాటు మొబైల్, ఇంటర్నెట్ బంద్

పంటలకు మద్దతు ధర కోరుతూ ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రైతు సంఘాలు తలపెట్టాయి. ఈ నేపథ్యంలో రైతులను దేశ రాజధాని నగరంలోకి అడుగుపెట్టకుండా ఢిల్లీ సరిహద్దులను సీల్ చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేసి.. ఏకంగా సిమెంట్‌తో కాంక్రీట్‌, రోడ్లపై ఇనుప మేకులు దింపుతున్నారు. ఇదే సమయంలో హరియాణా ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13న రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ను నిలిపివేయాలని తెలిపింది. ఈ మేరకు తమ ఆదేశాలను పాటించాలని హరియాణా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచించింది.

ఏడు జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్‌లు పంపడంపై ఈ నెల 11 ఉదయం ఆరు గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకూ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధం అయ్యారు. మరోవైపు, ట్రాక్టర్ ర్యాలీతో వచ్చే రైతులను అడ్డుకునేందుకు అంబాలా జిల్లాలోని రహదారులపై పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల రైతులు గురువారం పార్లమెంటుకు బయలుదేరగా ఢిల్లీ నగర శివారుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను రంగంలోకి దించారు. ప్రతి ఒక్కరినీ చెక్ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హర్యానా ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.


సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎమ్ఎమ్) వంటి 200కు పైగా రైతు సంఘాలు ఛల్లో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళన సమయంలో తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన హరియాణా, పంజాబ్‌ పోలీసులు, గతంలో పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story