హథ్రాస్ కేసు : దర్యాప్తు గడువు మరో పది రోజులు పొడిగింపు
హథ్రాస్ అత్యాచార కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి యూపీ ప్రభుత్వం గడువును మరో పది రోజులు పొడిగించింది. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి 'సిట్' బుధవారమే తన నివేదికను సమర్పించాల్సి ఉంది. మరింత లోతుగా కేసు దర్యాప్తు చేసేందుకు సిట్ బృందానికి మరో 10 రోజుల గడువును పెంచినట్లు తెలుస్తోంది. హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
సిట్ బృందం ఇప్పటికే హాథ్రస్లో పర్యటించింది. బాధితురాలిపై దాడి జరిగిన ప్రదేశంతోపాటు.. అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. కేసులో నిందితులు సహా బాధితురాలి కుటుంబసభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాల్సిందిగా భావిస్తున్నారు. అటు సిట్ సూచనల మేరకు జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లను యోగి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
హాథ్రస్ అత్యాచార ఘటనలో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు పేర్కొంది. యూపీ ప్రభుత్వం అక్టోబర్ 8న అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు యోగీ ప్రభుత్వం... హాథ్రస్ ఘటనలో సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేస్తామని.. చీఫ్ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని బెంచ్ తెలిపింది.
హాథ్రస్ అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది. కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలు రావడంతో.. ఆ కోణంలో దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. యూపీ పోలీసులు FIRలో ప్రస్తావించిన ఆరోపణలను... ED పరిశీలిస్తోందని.. దర్యాప్తు చేసి మనీలాండరింగ్ కేసు నమోదు చేయవచ్చని.. అధికార వర్గాలు తెలిపాయి. మోదీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే అంతర్జాతీయ కుట్ర గురించి యూపీ పోలీసులు సూచించినందున... NGO ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు ఉన్న సంబంధంలో.. ED దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com