Mamata Banerjee: మోదీ ప్రభుత్వం ఏకైక గ్యారెంటీ అల్లర్లు
ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గ్యారెంటీ అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడంపై ఆమె సెటైర్లు వేశారు. అల్లర్లు మాత్రమే వారి ఏకైక హామీ అంటూ విమర్శలు గుప్పించారు. అసోంలోని సిల్చార్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ... మోదీ ఎవరి కోసమో ఏమో చేస్తారనే నమ్మకం తనకు లేదన్నారు.
కానీ తాము గెలిస్తే మాత్రం రాష్ట్రంలో ఎన్నార్సీ, సీఏఏ అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు చాలా భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇంతటి అవినీతి ఎన్నికలను మనం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదన్నారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
అన్ని వివక్షపూరిత చట్టాలను రద్దు చేస్తాం. అసోం లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన టీఎంసీ అభ్యర్థులకు మద్దతునివ్వండి. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ 126 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఫైనల్ ఇంకా రావాల్సి ఉంది. నేను మళ్ళీ వస్తా" అని మమతా పేర్కొన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. అందరూ శాంతి, శ్రేయస్సు, అభివృద్థితో ముందుకు సాగాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. మమతా బెనర్జీ ట్వీట్పై బీజేపీ చురక అంటించింది. శాంతి సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదని... దానిని పాటించాలని బీజేపీ సూచించింది.రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ... మమతా బెనర్జీ శాంతిని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, కానీ శ్రీరామ నవమి రోజున ఇలాంటి సందేశం ఈ పండుగను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల పండుగల సమయంలోనూ ఆమె ఇలాంటి సందేశాన్ని ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. భారతీయతను, సనాతన ధర్మాన్ని ఆమె కించపరుస్తున్నారని విమర్శించారు. గత ఏడాది రామనవమికి ముందు మమతా బెనర్జీ రెచ్చగొట్టే మతపరమైన ప్రసంగాలు చేశారని, ఆ సమయంలో హింస కూడా జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అంతకుముందు అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com