Dheeraj Sahu: లెక్కలు చెప్పినది 27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు..

Dheeraj Sahu: లెక్కలు చెప్పినది  27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు..

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని, ఇంకా లెక్కింపులు కొనసాగుతున్నాయని తేలింది. విచిత్రం ఏంటంటే.. ఆయన తన అఫిడవిట్‭లో కేవలం 27 లక్షల నగదు మాత్రమే ఉందని రాశారు. కానీ అల్మారా చూస్తే కోట్ల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. ఇంత పెద్ద మొత్తం లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖ తల మీదకొచ్చింది. లెక్కిస్తుంటే టాలర్ మిషిన్లు పాడైపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడం ఇదే మొదటిసారి. పైగా సాహూ వద్ద లభించిన నోట్లన్నీ కొత్త నోట్లే కావడం గమనార్హం.

ధీరజ్ సాహు ఒక ప్రముఖ వ్యాపారవేత్త. మద్యం వ్యాపారి కూడా. ఆయన జార్ఖండ్‌లోని లోహదర్గా నివాసి, మాజీ ఎంపీ శివప్రసాద్ సాహు సోదరుడు. శివప్రసాద్ సాహు రెండుసార్లు రాంచీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. బీహార్‌లోని ఛోటానాగ్‌పూర్‌లో జన్మించిన ధీరజ్ సాహు తండ్రి రాయ్ సాహెబ్ బల్దేవ్ సాహు స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాహు కుటుంబం కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. ఆయన తల్లి పేరు సుశీలా దేవి. 1977లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధీరజ్, బీఏ పూర్తి చేసిన తర్వాత మొదట యూత్ కాంగ్రెస్‌లో చేరారు. సాహు మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2009లో తొలిసారిగా, 2010 జూలైలో, ఆ తర్వాత మే 2018లో రాజ్యసభకు చేరుకున్నారు.ఆయన కుటుంబం చాలాకాలంగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. 2010 నుంచి జార్ఖండ్ నుంచి ధీరజ్ రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కుటుంబం పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. తాజాగా ఐటీ శాఖ దాడులు నిర్వహించిన డిస్టిలర్ గ్రూప్, దాని అనుబంధ సంస్థల్లోనూ ధీరజ్ కుటుంబ సభ్యులకు లింక్ ఉందని తేలింది. బౌద్ డిస్టిలరీస్‌లో గ్రూప్ కంపెనీ అయిన బల్దేవ్ సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కాంగ్రెస్ ఎంపీతో లింక్ చేయబడింది.


ఆదాయపు పన్ను శాఖకు చెందిన 40 మంది సభ్యుల బృందం జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణాలపై దాడులు చేస్తోంది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ దాడిలో ఇప్పటి వరకు ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో రూ.290 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ చోట అల్మారాలో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఒడిశాలోని ధీరజ్ సాహుకు చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది. ఇది కాకుండా ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్.. జార్ఖండ్‌లోని రాంచీ-లోహర్‌దగా.. కోల్‌కతాలో కూడా దాడులు జరిగాయి. ఆదాయపు పన్ను అధికారి నగదును 156 బ్యాగుల్లో నింపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story