Indian Navy: భారత నేవీ మరో సాహసం..

Indian Navy: భారత నేవీ మరో సాహసం..
సముద్రపు దొంగల నుంచి 23 మంది పాకిస్థానీయులకు విముక్తి

అరేబియా సముద్రంలో హైజాక్‌ అయిన ఇరాన్‌ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్‌ నేవీ రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 28న సొకొత్రా తీరానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో చేపల బోటుపై దాడి జ‌రిగింది. ఈ దాడి జ‌రిగిన పూర్తి స‌మాచారాన్ని నేవీ ప్ర‌క‌ట‌న‌ ద్వారా విడుద‌ల చేసింది.

‘‘దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నైకలను అక్కడికి పంపించాం. 12 గంటల పాటు శ్రమించి నావపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం’’ అని నేవీ పేర్కొంది. పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం, నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టామని పేర్కొంది. సొకొత్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేసినట్టు వెల్లడించింది.

నేవీ ప్రకటన ప్రకారం, తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ.. దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తరువాత.. సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం దొంగలను అదుపులోకి తీసుకుంది.

ఈ నెల మొదట్లో భారత నేవీ మరో నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి రక్షించింది. భారత తీరానికి సుమారు 2600 కిలోమీటర్ల దూరంలో పైరేట్లు రూయెన్ అనే నౌకపై దాడి చేశారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది. ఈ ఘటనలో 35 సముద్రపు దొంగలు లొంగిపోయారు. రూయెన్‌లోని 17 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story