COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
కొత్త వేరియంట్ కారణంగానే

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా భయాలు కమ్ముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు కారణమైన జేఎన్‌-1 ఉపరకం భారత్‌లో కూడా జడలు విప్పుతుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జేఎస్‌-1ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO వర్గీకరించింది. భయపడాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

దేశంలో కరోనా వైరస్‌ జేఎన్‌.1 వేరియంట్‌ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,669కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,33,327 మంది మరణించారు.

కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్‌-1పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరగడానికి కొవిడ్-19 ఉపరకం జేఎన్‌.1 కారణమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు. పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్‌ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. ఇటీవల అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలను పెంచాలని అధికారులకు సూచించింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మే 21 తర్వాత దేశంలో నమోదైన రోజువారీ కొవిడ్‌ కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,311 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌కు చెందిన కొత్త కేసులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో ముగ్గురు మరణించాగా, కొత్త కేసుల్లో 300 రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story