Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం

Mukhtar Ansari:  గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం
ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా మృతి

మాఫియా గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పలు కేసుల్లో జైలుపాలైన లక్నోలోని బండా మెడికల్ కాలేజీఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మావు సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2005 నుంచి వివిధ కేసుల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ జైళ్లలోనే ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎనిమిది కేసుల్లో ఆయనకు శిక్షలు పడ్డాయి. 2022 సెప్టెంబర్ నుంచి బండా జైలులోనే ముక్తార్ అన్సారీ ఉన్నారు. ముక్తార్ అన్సారీకి గుండెపోటు వచ్చిందని, దవాఖానకు తీసుకెళ్లామని బండా జైలు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, జిల్లా కేంద్ర దవాఖాన వద్ద జర్నలిస్టులు లోపలికి రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో ముక్తార్ అన్సారీ సొంత జిల్లా ఘజీపూర్, మావు జిల్లాల్లో భద్రత పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఘజీపూర్ జిల్లా కలెక్టర్ ఆర్య్కా అఖౌరీ, ఎస్పీ ఓంవీర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. మావు ఎస్పీ ఎలెమారన్ జీ నేరుగా రంగంలోకి వచ్చి జిల్లా పరిధిలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

గత మంగళవారం ఉదయం ముక్తార్ స్ప్రుహ కోల్పోవడంతో జిల్లా దవాఖానకు తరలించారు. కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలతో దవాఖానలో చేరిన ముక్తార్ కు 15 గంటల చికిత్స తర్వాత డిశ్చార్జీ చేశారు. గతవారం ముక్తార్ న్యాయవాది రణ్ దీర్ సింగ్ సుమన్.. బారాబంకీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కక్షిదారుకు జైలు సిబ్బంది స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసిన రణ్ దీర్ సింగ్ సుమన్, వైద్యాధికారులతో చికిత్స చేయించాలని కోరారు. తన సోదరుడికి జైలులో విషం ఇచ్చారన్న వార్త తెలిసి బండా జైలుకెళ్లానని ముక్తార్ సోదరుడు, ఘజీపూర్ ఎమ్మెల్యే అఫ్జల్ అన్సారీ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story