JAWAN: సైనికుడి అదృశ్యం...ముష్కరుల పనేనా..?

JAWAN: సైనికుడి అదృశ్యం...ముష్కరుల పనేనా..?
కశ్మీర్‌లో భారత సైనికుడి అదృశ్యం... ముష్కరుల పనే అని అనుమానం.. రంగంలోకి భద్రతా దళాలు

కశ్మీర్‌లో ఓ సైనికుడు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు అతడు ప్రయాణించిన వాహనం రక్తపు మరకలతో దొరకడంతో సైన్యం అప్రమత్తమైంది. కుల్గామ్‌ (Kulgam) జిల్లాలోని అచతల్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల జావేద్‌ అహ్మద్‌ వానీ (Javed Ahmad Wani) ఇండియన్‌ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా(Soldier) పనిచేస్తున్నాడు. లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ లడఖ్‌లోని (Ladakh) లేహ్‌లో అహ్మద్‌ వానీ విధులు నిర్వహిస్తున్నారు. కుల్గామ్‌ జిల్లాలో సెలవులపై ఇంటికి వచ్చిన వానీ అదృశ్యమయ్యాడు.


ఇంటికి వచ్చిన జవాన్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పరన్హాల్‌ సమీపంలో అతని కారును గుర్తించారు. కారుకు లాక్‌ వేయకపోగా అందులో జావేద్‌ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు.

వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అతని జాడకోసం ఆర్మీ, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుని జల్లడపడుతున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి బోరున విలపిస్తున్నారు. తన కుమారుడిని విడుదల చేయాలని జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జావెద్‌ కుటుంబ సభ్యలు కూడా తమ కుమారుడు కిడ్నాపై ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

2018లో సైన్యంలోని 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబు అనే సైనికుడు కూడా సెలవుపై ఇంటికి వచ్చాడు. అప్పట్లో అతడిని హజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను సైన్యం ఆ తర్వాత మట్టుబెట్టింది. అనంతరం రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబుకు ప్రభుత్వం శౌర్యచక్రను బహూకరించింది.

Tags

Read MoreRead Less
Next Story