Maharshtra: అమ్మనాన్న నాకు ఓటేయకుంటే మీరు తిండి మానండి- స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే సూచన

Maharshtra: అమ్మనాన్న నాకు ఓటేయకుంటే మీరు  తిండి మానండి- స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే సూచన
వీడియో వైరల్ కావడంతో చెలరేగిన దుమారం.

ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే ఉల్లంఘించాడు. తల్లిదండ్రులు తనకు ఓటు వేయకపోతే మీరు రెండు రోజులు పాటు భోజనం మానేయాలని స్కూల్‌ పిల్లలను ఒక ప్రజాప్రతినిధి నూరిపోశాడు. అలాగే, తన పేరును పలుమార్లు చిన్నారులతో చెప్పించుకున్న ఆ ఎమ్మెల్యే.. తన పైత్యాన్ని చాటుకున్నాడు. ఆ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటుచేసుకోగా... సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబరులో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సంతోష్ బంగర్ ప్రచారంలో నిమగ్నమయ్యాడు.

ఓ పాఠశాలను సందర్శించిన శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఎమ్మెల్యే సంతోష్‌ బంగార్‌ విద్యార్థులతో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఓట్లన్నీ నాకే పడాలి.ఇలా జరగాలంటే మీరంతా మీ తల్లిదండ్రులకు చెప్పాలి. సంతోష్‌ బంగార్‌కు ఓటు వేస్తేనే తిండి తింటామని, లేకుంటే తినమని కండీషన్‌ పెట్టాలి. అయినా ఓటు వేయకుంటే రెండు రోజులు తినడం మానేయాలి’ అని సూచించారు. ఇది చూసి ఆయన వెంట ఉన్న నాయకులతోపాటు అక్కడ టీచర్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే సంతోష్ బంగర్ తీరుపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్ స్పందిస్తూ... రాజకీయ ప్రచారానికి లేదా ఎన్నికల సంబంధిత పనులకు పిల్లలను వాడుకోవద్దని ఈసీ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇది పట్టడం లేదని విమర్శించారు. బాలకార్మికుల సవరణ చట్టం 2016 కింద ఉల్లంఘనే అవుతుందని, విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌పై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తరుచూ బంగర్ ఇలాంటి తప్పులు చేస్తున్నా బీజేపీ కూటమి ఎమ్మెల్యే కావడంతో చూసీచూడకుండా వదిలేస్తున్నారని, ఈసీ పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలనీ ఎన్సీపీ (శరద్ పవార్) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో కోరారు. గతంలోనూ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కాకుంటే తాను నడిరోడ్డుపై ఉరేసుకుంటానని ప్రకటించాడు.


Tags

Read MoreRead Less
Next Story