Uttar Pradesh: బుక్ చేద్దామనుకొని బుక్ అయిన పోలీసులు

Uttar Pradesh: బుక్ చేద్దామనుకొని బుక్ అయిన పోలీసులు
గన్నుపెట్టింది వాళ్ళే అరెస్టు చేసింది వాళ్లే..

చేసే తప్పుపనిని పక్కాగా ప్లాన్ చేయక పోవడం తో పట్టుబడిపోయారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఓ ఇద్దరు పోలీసులు ఒక యువకుడిని టార్గెట్ చేశారు. ఏదో ఒక కేసులో ఏం ఖర్మ అక్రమ ఆయుధం అయితే ఇరికించడం సులువు అనుకున్నారేమో ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు కానీ పాపం అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఎలా బెడిసికొట్టింది అంటే ..

మీరట్‌లో ఉంటున్న అజిత్ త్యాగి అనే వ్యక్తి ఇంటికి సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి న పోలీసులు వెళ్లారు. కొంతమంది తనిఖీల నెపంతో ఇంట్లోకి వెళ్లగా మరి కొంతమంది అజిత్ త్యాగి బైక్ వద్దకు వెళ్లి చెక్ చేసారు. బైక్‌లో నుంచి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నావంటూ హడావిడిగా అజిత్‌ ను అరెస్ట్ చేశారు. అయితే అసలు బైక్‌లోకి తుపాకీ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అజిత్ కుటుంబ సభ్యులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డు అయిన ఫుటేజీని చూసి ఒక్కసారిగా అవ్వాక్కు అయ్యారు. తనిఖీలకోసం పోలీసులు ఇంటి డోర్ కొట్టే ముందు వాళ్లే బైక్‌లో తుపాకీ పెట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో ఎదో కుట్ర జరుగుతోంది అని అర్థం చేసుకున్న అజిత్ తల్లిదండ్రులు తమ కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తమకు ఒకరితో భూవివాదం ఉందని, పోలీసులు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఇలా అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విషయం బయటపడ్డాక సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను అలా ఎందుకు చేశారో ప్రశ్నిస్తున్నామని, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story