ప్రేమించుకున్నారని ప్రాణాలు తీశారు

శవాలకు రాళ్లు కట్టి మోసళ్ళ నదిలో పడేసిన వైనం

ప్రేమించుకోవడమే ఆ జంట చేసిన పాపం అయిపోయింది. ప్రేమించిన యువకుడిని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి చెప్పడమే ఇద్దరి పాలిట శాపం అయిపోయింది. కూతుర్నే కాదు ఆమె ప్రేమించిన యువకుడిని కూడా కుటుంబ సభ్యుల సహాయంతో చంపిన తండ్రి, ఆ శవాలకు బరువైన రాళ్లు కట్టి మోసళ్ళు తిరిగే నదిలో పడేసాడు. హృదయాన్ని కలచి వేసే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మొరేనా జిల్లాలోని రతన్​బసై గ్రామానికి చెందిన 18ఏళ్ల శివాని, పక్క గ్రామానికి చెందిన 21ఏళ్ల రాధేశ్యామ్​ తోమర్​లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. రాధేశ్యామ్​ను మర్చిపోవాలని బెదిరించారు. కానీ ఆమె వారి మాటలను పట్టించుకోలేదు. ఈ నెల 3న ప్రేమ జంట అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాధేశ్యామ్​ కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే శివాని కూడా అదృశ్యమైందని తెలిపాడు. అయితే ప్రేమికులు పారిపోయి, పెళ్లి చేసుకుని ఉంటారని, తిరిగొచ్చేస్తారని పోలీసులు తొలుత భావించారు. కానీ రాధేశ్యామ్​ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. వారిద్దరిని అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు గ్రామాల్లోని కొంతమంది ప్రజలను విచారించారు. ప్రేమికులు పారిపోవడాన్ని వారెవ్వరు చూడకపోవడంతో పోలీసులకు అనుమానం పెరిగింది. బాలిక తండ్రిని పోలీసులు తమదైన విచారించగా ఒక్కో విషయం బయటపడింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, బాలిక తండ్రి తోమర్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన కుమార్తె శివాని తోమర్, ఆమె ప్రియుడు రాధేశ్యామ్ తోమర్‌ లను 3వ తేదీన హత్య చేసి, ఆపై వారి మృతదేహాలను రాళ్లు కట్టి నదిలో పడవేసినట్లు అంగీకరించారు. స్థానిక పోలీసులు మృతదేహాలను వెతకడానికి చర్యలు చేపట్టారు.స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , డైవర్ల బృందం నదిలో మృతదేహాల కోసం వెతుకుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story