Seema Haider: విచారణలో విస్తుపోయే వాస్తవాలు

Seema Haider:  విచారణలో విస్తుపోయే వాస్తవాలు
అన్నీ అనుమానాలే

పబ్జీ ప్రేమ కథలో ఊహించని మలుపులు పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాను ప్రేమికురాలిని... గూఢచారిని కాదంటూ చెప్పుకుంటూ వస్తున్న సీమా హైదరీని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. పబ్జీ ఆడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా అనే యువకుడి ప్రేమలో పడి నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లో అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాకిస్థాన్‌ మహిళ సీమా గులాం హైదర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సీమా ముందుగా సంప్రదించింది సచిన్‌ మీనాను కాదని విచారణలో తేలింది. ఆమెకు దిల్లీలో మరి కొంతమందితో పరిచయం ఉన్నట్లు ఏటీఎస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఏటీఎస్‌ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.



నిన్నటి విచారణ తర్వాత సీమా హైదర్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం సులువేం కాదని ఏటీఎస్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమా ఆంగ్ల పరిజ్ఞానం సైతం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిందట. మరోవైపు, సీమా హైదర్‌ ఏజెంట్‌ అని, ఆమెను పాకిస్థాన్‌కు తిరిగి పంపాలని గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్‌ పంపారు. ఈ బెదిరింపు మెసేజ్‌పై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతకముందు సీమా దిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నందుకు నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం సీమాను అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌తోపాటు అతడి తండ్రిని కూడా అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ఈ నేపథ్యంలో వారి ముగ్గురిని యూపీ ఏటీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సీమా మాత్రం తాను ఇప్పుడు పూర్తి హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు వెళ్లబోనని చెబుతోంది. మరోవైపు సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్‌ సైతం కోరాడు.

Tags

Read MoreRead Less
Next Story