Haridwar: బాలుడిని గంగలో ముంచేసిన మేనత్త, బాలుడి మృతి

Haridwar:  బాలుడిని గంగలో ముంచేసిన మేనత్త, బాలుడి మృతి
బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందంటూ 5 నిమిషాలపాటూ నీటిలోనే

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో విషాద ఘటన జరిగింది. ఓ మహిళ తన మేనల్లుడి చావుకు కారణమైంది. గంగానదిలో ముగినితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ నీట ముంచి చంపేసింది. ఐదేళ్ల వయసులోనే ఆ చిన్నారి బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పేశారు. కన్నబిడ్డ శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగాస్నానంతో అద్భుతం జరగొచ్చన్న చివరి ఆశతో చిన్నారికి నదీస్నానం చేయించారు. కానీ చివరికి బాలుడు దుర్మరణం చెందాడు. హరిద్వార్‌లో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది.

ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ చిన్నారిని తల్లిదండ్రులు కారులో హరిద్వార్‌కు తీసుకొచ్చారు. వారి వెంట మరో బంధువు కూడా ఉన్నారు. ఆ తరువాత బాలుడికి తల్లిదండ్రులు గంగాస్నానం చేయించారు. ఈ క్రమంలోనే చిన్నారిని మేనత్త నీటిలో 5 నిమిషాలూ ఉండేలా చేసింది. దీంతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఒడిలో పడుకోబెట్టుకుని అతడి మేనత్త ఉన్మాదంతో చిన్నారి బతికొస్తాడంటూ అరిచింది. పరిస్థితి తొలి నుంచీ గమనిస్తున్న స్థానికులు చిన్నారి తల్లిదండ్రులపై మండిపడ్డారు. బాలుడి మరణానికి వారే కారణమంటూ నిందించారు. మరోవైపు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీలో బయలుదేరినప్పటి నుంచే బాలుడి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించిందని ఆ కుటుంబం ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ తెలిపాడు. హరిద్వార్ చేరుకునే సరికి చిన్నారి పరిస్థితి విషమించిందని వెల్లడించాడు. కుమారుడి ప్రాణాంతక వ్యాధి గురించి, గంగాస్నానం గురించి అతడి తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా ట్యాక్సీ డ్రైవర్ వెల్లడించాడు. బాలుడి తల్లిదండ్రులపైన, అత్త పైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story