Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్నపై వేటుకు సిద్ధం

Prajwal Revanna:  ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్నపై వేటుకు సిద్ధం
హాసన్​ సెక్స్ రాకెట్​లో షాకింగ్ నిజాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. జేడీఎస్​ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి సోమవారం శివమొగ్గలో ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యవహారంలోకి మిత్రపక్షం బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లాగడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న ప్రజ్వల్ వ్యవహారంపై జేడీఎస్​ మిత్రపక్షం బీజేపీ, మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి.


అంతకుముందు, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధమని మాజీ మంత్రి, జేడీఎస్​ ఎమ్మెల్యే హెచ్​డీ రేవణ్న స్పష్టం చేశారు. అభియోగాలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. "మేము ఇక్కడే ఉన్నాం. చట్టప్రకారం ఎదుర్కొంటాం. ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం విషయంపై ఇప్పుడు కేసు పెడుతున్నారు. దీనిపై నేను మాట్లాడను. కేసును సిట్​కు అప్పగించారు. వారి దర్యాప్తునకు ఆటంకం కలగకూడదు" అని చెప్పారు రేవణ్న. కుమారుడితోపాటు తనపైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడంపై ప్రశ్నించగా, దీని వెనుక రాజకీయం ఉందని ఆరోపించారు. "వాళ్లు(కాంగ్రెస్​ నేతలు) అధికారంలో ఉన్నారు. వారికి నచ్చినట్టు చేస్తారు" అని వ్యాఖ్యానించారు రేవణ్న.

ప్రజ్వల్‌ రేవణ్న సెక్స్‌ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ ఆయనకు బంధువు అని తెలుస్తోంది. వరసకు బాధిత మహిళ ప్రజ్వల్‌కు సోదరి అని సమాచారం. ప్రజ్వల్‌ రేవణ్న మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం BCM హాస్టల్‌లో వంట పని చేసేందుకు ప్రజ్వల్‌ అవకాశాన్ని కల్పించారు. తర్వాత 2015లో తన నివాసంలోనే బాధిత మహిళను ప్రజ్వల్‌ పనిలో చేర్పించుకున్నారు. రేవణ్న నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని ఆమె చెప్పారు. తాను పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఆయన తల్లి భవానీ రేవణ్న ఇంట్లో లేని సమయం చూసి తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపణలు చేశారు.

యువతులను ప్రలోభ పెట్టి, ప్రజ్వల్‌ తన వాంఛలను తీర్చుకుని వాటిని వీడియోలుగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు దుయ్యబట్టారు. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలు, వీడియోకు సంబంధించిన ఆరోపణలపై మాట్లాడేందుకు విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ నిరాకరించారు. జనతా దళ్‌ నేతలే దానికి సంబంధించి మాట్లాడతారని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. ప్రజ్వల్‌ను పొత్తు అభ్యర్థిగా బరిలో నిలిపి భాజపా తప్పు చేసిందని ఆ పార్టీ సానుభూతిపరులు విమర్శలు గుప్పించారు.

లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సిఫార్సు మేరకు ఈ అంశంపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story