Karnataka: కర్ణాటకలో దేవాలయాలపై పన్ను..

Karnataka:  కర్ణాటకలో దేవాలయాలపై పన్ను..
కొత్త బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం, బిజేపి ఆగ్రహం

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకున్నది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండో‌మెంట్స్ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది .దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించింది. ఈ బిల్లును ఆమోదించటం ద్వారా ఖజానాను నింపుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తున్నదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యెడియూరప్ప విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు వసూలు చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాల ఆదాయంపై ఎందుకు దృష్టి సారించటం లేదన్నది లక్షలాది హిందూ భక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత రామలింగారెడ్డి స్పందించారు. బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు. దేవాలయాల నుంచి వసూలు చేసే సొమ్ము ప్రభుత్వం తీసుకోదని, దానిని ధార్మిక పరిషత్‌ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని వెల్లడించారు. బీజేపీ కూడా తన హయాంలో ఇలాగే చేసిందని, రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఆదాయమున్న దేవాలయాల నుంచి 5 శాతం బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని, రూ. 25 లక్షలకు పైబడి ఆదాయమున్న ఆలయాల నుంచి పది శాతం వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల అభ్యున్నతి, సీ గ్రేడ్‌ ఆలయాల అభ్యున్నతి, అర్చకుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం లాంటి పనులు ధార్మిక పరిషత్‌ ముఖ్య ఉద్దేశాలని మంత్రి సెలవిచ్చారు.

అయితే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన హిందూ ధార్మిక సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లుపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్తగా తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకున్నదని ఆరోపించారు. రాహుల్‌ దిగజారుడుతనానికి ఈ బిల్లు ఒక మచ్చుతునక అని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యల నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం మతపరమైన ఎండోమెంట్‌ బిల్లును తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. ఆలయాల నిర్వహణ కోసం హిందూ భక్తులు ఇస్తున్న విరాళాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటున్నదని ఆరోపించారు. హిందూ భక్తుల సొమ్మును కర్ణాటక కాంగ్రెస్‌ కొల్లగొడుతున్నదన్న చంద్రశేఖర్‌.. కాంగ్రెస్‌కు ఇది ఏటీఎం మిషన్‌ అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story