CJI Chandrachud: ఐదేండ్లకొకసారి ఐదు నిమిషాలు..

CJI Chandrachud: ఐదేండ్లకొకసారి ఐదు నిమిషాలు..
ఓటర్లకు జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక సందేశం

లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత పౌరులను కోరారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇక శుక్రవారం తొలి విడత పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. ఇక ఏప్రిల్ 26న సెకండ్ విడత పోలింగ్ జరగనుంది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది.

జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని గుర్తుచేశారు. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందని.. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానని.. గర్వంగా ఓటు వేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు అని రాసుందని చంద్రచూడ్‌ తెలిపారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story