CHINA: విదేశీ ప్రభుత్వాలపై చైనా సైబర్‌ దాడులు

CHINA: విదేశీ ప్రభుత్వాలపై చైనా సైబర్‌ దాడులు
భారత్‌ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారం తస్కరణ.... ది వాషింగ్టన్ పోస్ట్‌ సంచలన కథనం

చైనా హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై పెద్దఎత్తున సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు అమెరికాకు చెందిన "ది వాషింగ్టన్‌ పోస్ట్‌" సంచలన కథనం ప్రచురించింది. కేవలం భారత్‌ నుంచే దాదాపు 95 G.B ఇమిగ్రేషన్ డేటాను చైనా హ్యాకింగ్ ముఠా తస్కరించినట్లు అందులో పేర్కొంది. చైనా హ్యాకర్ల ముఠా భారత్ సహా పలు దేశాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్టు "ది వాషింగ్టన్ పోస్ట్" ఓ కథనంలో వెల్లడించడం కలకలం రేపింది. చైనా ప్రభుత్వ మద్దతున్న హ్యాకింగ్‌ సంస్థ "ఐసూన్‌కు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయని, ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు ఆ కథనం వెల్లడించింది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చైనా హ్యాకర్లు భారీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు అందులో తేలిందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని డ్రాగన్ హ్యకర్లు ఈ దాడులు చేసినట్లు "ది వాషింగ్టన్ పోస్ట్" తెలిపింది.


లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న "ఐసూన్‌" అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. గత వారం అవి గిట్‌ హబ్‌లో వెలుగుచూశాయని, చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వశాఖలకు ఈ సంస్థ థర్డ్‌ పార్టీ హ్యాకింగ్‌ సేవలు అందిస్తోందని పేర్కొంది. సైబర్‌ దాడులు చేసి విదేశీ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లతో చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. భారత్‌, యూకే, తైవాన్‌, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు తేలిందని ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ పత్రాలు ఎలా లీకయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

"ఐసూన్‌" హ్యాకర్లు విదేశాల్లోని 80 లక్ష్యాల నుంచి డేటా తస్కరించినట్లు లీకైన పత్రాల్లో ఉందని సమాచారం. భారత్‌ నుంచి దాదాపు 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్‌ డేటాను సేకరించారని, దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్‌ నుంచి 3 టెరాబైట్ల కాల్‌ లాగ్స్‌ సమాచారాన్ని దొంగిలించారని "ది వాషింగ్టన్‌ పోస్ట్‌" కథనం వెల్లడించింది. అయితే... ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story