Tehreek-e-Hurriyat: తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై నిషేధం

Tehreek-e-Hurriyat: తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై  నిషేధం
కేంద్రం కీలక నిర్ణయం..

జమ్మూ కశ్మీర్‌కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద తెహ్రీక్-ఎ-హురియత్ చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో మరణించిన వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించారు.

జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీసి ఇస్లామిక్‌ పాలనను నెలకొల్పేందుకు తెహ్రీక్ ఏ హురియత్ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక ప్రచారాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తమ హోంమంత్రిత్వశాఖ బృందం గుర్తించిందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ పాలసీ కింద, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థను అయినా వెంటనే అడ్డుకుంటుంది’’ అని అమిత్ షా ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. మసరత్ ఆలం భట్ అధ్యక్షతన ఉన్న ఎంఎల్ జేకే -ఎంఏ భారత వ్యతిరేక,పాకిస్తాన్ అనుకూల ప్రచారంలో పాల్గొన్నందుకు దాన్ని నిషేధించారు. భారత్‌పై దుష్ప్రచారం చేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు తెహ్రీక్-ఏ-హురియత్ ఏర్పడిందని, ఉపాచట్టం కింద జమ్మూ కశ్మీర్‌లో తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్‌ వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ 2004లో తెహ్రీక్‌ ఏ హురియత్‌ను స్థాపించారు. గిలానీ తర్వాత అనంతరం తెహ్రీక్-ఎ-హురియత్ చైర్మన్ ముహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ పని చేశారు. 2021 సంవత్సరంలో ఆయన మరణించాడు. హురియత్ కాన్ఫరెన్స్ సంస్థ. హురియత్ కాన్ఫరెన్స్ అనేది జమ్మూ కశ్మీర్‌లోని 26 సంస్థల సమూహం. ఇది 1993లో ఏర్పడింది. హురియత్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ అనుకూల, వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. వీటిలో జమాత్-ఎ-ఇస్లామీ, జేకేఎల్‌ఎఫ్‌, దుఖ్తరన్-ఎ-మిల్లత్ మొదలైన పేర్లు ఉన్నాయి. 2005లో హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలుగా విడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story