YOGI ADITYANATH: ఒకే రోజు 124 ప్రాజెక్టులకు అంకురార్పణ

YOGI ADITYANATH: ఒకే రోజు 124 ప్రాజెక్టులకు అంకురార్పణ
యోగీ ఆదిత్యనాథ్‌ రికార్డు.. ఒకే రోజు 124 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.. నోయిడా నుంచి గ్రేటర్‌ నోయిడా వరకు అభివృద్ధి బాట...

ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన యోగీ ఆదిత్యనాథ్‌.. అభివృద్ధి ప్రాజెక్టులను పరుగు పెట్టిస్తున్నారు. ఒకేరోజు 124 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు. నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లోఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల్లో కొన్నింటికి యోగీ అంకురార్పణ చేయగా కొన్నింటినీ ప్రారంభించారు. నోయిడా స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 17 వంద 19 కోట్ల విలువైన 124 అభివృద్ధి ప్రాజెక్టులను యోగీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేబుల్ బ్రిడ్జ్ తరహాలో నిర్మించిన పార్థాల ఫ్లై ఓవర్ నుంచి వేద్ వాన్ పార్క్ వరకు పలు ప్రాజెక్టులకు యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ పార్థాల ఫ్లైఓవర్‌ను 84 కోట్లతో నిర్మించారు. నోయిడా నుంచి గ్రేటర్ వరకు MP-3 రహదారిని ఈ ఫ్లై ఓవర్‌ కలుపుతుంది. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ తరహాలోనే ఇది కేబుల్ మోడల్ లో నిర్మించారు. ఇది 650 మీటర్ల పొడవుతో క్యారేజ్‌వేకి ఇరువైపులా మొత్తం 28 కేబుళ్లను వాడి నిర్మించారు. సెక్టార్ 78లో వేద్ వాన్ పార్క్ 12 ఎకరాల్లో 22.68 కోట్లతో నిర్మించారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్' నిర్వహించిన మరొక కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్..మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మన సంస్కృతిపై ఏదైనా దాడి జరిగినా లేదా జరుగుతున్నా, అది డిజిటల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా అయినా, దాని విధానం మారిందని యోగీ తెలిపారు. ఆ పద్ధతులను మనం అర్థం చేసుకోవాలన్నారు. స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ ద్వారా మార్పిడులు చేస్తున్న ఓ గ్యాంగ్ కేసును పోలీసులు తాజాగా గుర్తించారన్నారు. గతంలో వికలాంగ పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో ముఠాను పోలీసులు ఛేదించారని యోగీ గుర్తుచేశారు. వారు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇచ్చారని, వారి ముఠా పరిధి కేవలం యూపీకే పరిమితం కాలేదని, 25-30 రాష్ట్రాలకు విస్తరించారని తెలిపారు. మత మార్పిడి సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదని, ఇటీవల ఢిల్లీ, ముంబైలో జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణ అని యోగీ తెలిపారు. 2020లో యూపీలో ఇలాంటి రెండు మూడు ఘటనలు జరిగినప్పుడు తాము ఆర్డినెన్స్ తెచ్చి చట్టం ఆమోదించామన్నారు. ఇలాంటి దాడులపై ప్రజలకు అవగాహన కల్పించాలని యోగి పిలుపునిచ్చారు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. భారత సంస్కృతికి భంగం వాటిల్లితే సహించేదే లేదని యూపీ సీఎం తేల్చి చెప్పారు. నోయిడా సెక్టార్ 123లో సబ్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. దీనిని 142 కోట్లతో అభివృద్ధి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story