Manipur :మణిపూర్‌ మరో దారుణం -యువకుడి సజీవ దహనం

Manipur :మణిపూర్‌ మరో దారుణం -యువకుడి సజీవ దహనం
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

మణిపూర్ దారుణాలకి సంబంధించిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది. ఈ భయాంకర ఘటనకు సంబంధించిన 7 సెకన్ల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

మణిపూర్అల్లర్లు ఇప్పట్లో చల్లబడేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రంలో మెయితీలు, కుకీలు మధ్య ఇంకా చిచ్చు రగులుతూనే ఉంది. ఇరువురు మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేయడం పై రాష్ట్రం అట్టుడుకిపోతుంది. రెండు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులను అపహరించి చంపేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా మరోసారి హింస తీవ్రతరం అయ్యింది.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీని గురించి మణిపూర్‌ రాష్ట్ర పోలీసులు స్పందిస్తూ ”థౌబాల్‌ జిల్లాలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మే 4 న ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన రోజే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు.


అదే రోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు..గుంపుగా ఏర్పడి కుకి వర్గానికి చెందిన వ్యక్తిని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. మణిపూర్‌ లో హింస మొదలైన రెండు రోజులకే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వారు తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న అందర్నీ అరెస్టు చేశామని, వారిపై కేసు నమోదుచేశామని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చాక మరోసారి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. కుకీ,మెయితీ వర్గాల మధ్య గత 5 నెలలుగా ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి కూడా రాష్ట్రంలో ఏదోక మూల అల్లర్లు జరుగుతునే ఉన్నాయి. ముఖ్యమంత్రికి చెందిన ఒక ఇంటిని కూడా కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story