Supreme Court: లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు

Supreme Court: లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు
సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.

చట్టసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపులేవీ ఇచ్చేదిలేదని కోర్టు తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగాలు చేసేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే ఆయా సభ్యులకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించలేమని స్పష్టంచేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 1998 నాటి పీవీ నరసింహారావు సర్కారు వర్సెస్‌ సీబీఐ కేసు తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.

జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సొరేన్‌ 2012 రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకు వెళ్లారు. దీనిపై తీర్పును వెలువరించడానికి ఏకంగా నాలుగు సార్లు సుప్రీంకోర్టు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేయవలసివచ్చింది. సీతా సొరేన్‌ కేసును హైకోర్టు తిరస్కరించడంతో ఆమె విజ్ఞప్తి మేరకు ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం 2014లో విచారణ జరిపింది. అయితే, కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి సిఫారసు చేసింది. దీంతో 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. చివరకు ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేశారు.

అనంతరం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా 1998నాటి పీవీ నరసింహారావు సర్కారు వర్సెస్‌ సీబీఐ కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. విస్తృత ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story