Parliament: డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

Parliament: డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
19 రోజులు, 15 సిట్టింగులు, సోషల్ మీడియాలో వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారైంది .డిసెంబర్‌ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ X ద్వారా వెల్లడించారు. డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ మరుసటి రోజే పార్లమెంట్ వింటర్ సెషన్‌ మొదలవుతుంది.

క్రిస్మస్‌ పండుగకు మూడు రోజుల ముందు డిసెంబర్‌ 22న సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఐపీసీ (IPC), సీఆర్‌పీసీ (CrPC), ఎవిడెన్స్‌ యాక్ట్‌ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్‌ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగనుంది. టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా విషయం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని ఓ వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.

వాస్తవానికి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్‌ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్‌ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ మొదలవుతున్నది. ఎప్పటిలాగే క్రిస్మస్‌ పండుగకు ముందు సెషన్‌ ముగియనుంది.

ఈ 3 బిల్లులతోపాటు మరిన్ని కీలక బిల్లులు కూడా చట్టసభల ముందుకు రానున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను తీసుకువచ్చే ప్రయత్నం కేంద్రం చేసినప్పటికీ.. ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసనలతో విరమించుకున్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్న సీఈసీ, ఈసీ హోదాలను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావడానికి ఈ బిల్లులను తీసుకువచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story