Kerala : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..తల్లీబిడ్డ మృతి!

Kerala : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..తల్లీబిడ్డ మృతి!
భర్తను అరెస్ట్‌ చేసిన పోలీసులు

స్వంత తెలివితో ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యకు ఆక్యుపంక్చర్‌ తో ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భర్తను అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల గర్భిణీ అయిన షెమీరా బీవీకి ఆక్యుపంక్చర్ తో బిడ్డను ప్రసవించేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. అయితే బిడ్డ బయటకు వచ్చిన తరువాత ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో పాటు ఎటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లింది. దీంతో కంగారు పడిన భర్త ఆమెను చివరి నిమిషంలో ఆసుపత్రికి తరలించాడు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె , ఆమెతో బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతురాలి భర్త మొదటి నుంచి కూడా తన భార్యకు నార్మల్‌ డెలివరీ అయ్యేందుకు యూట్యూబ్ లో వీడియోలు చూసేవాడు. భార్య గర్భవతిగా ఉన్న 9 నెలల్లో ఒక్కసారి కూడా ఆమెను వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లకుండా యూట్యూబ్ లో చూసిన మందులనే వాడేవాడు. దీంతో ఆమెకు సరైన చికిత్స అందేది కాదు. మహిళ గర్భంతో ఉంది అని తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్లిన ఆ శాడిస్టు భర్త కనీసం వారిని కలవనిచ్చేవాడు కాదని పోలీసుల విచారణలో తేలింది.


స్థానిక ఆశా కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం..మహిళకు ఇది నాలుగో ప్రసవం. మొదటి మూడు కూడా సి సెక్షన్‌ ద్వారా జరిగాయి. అయినప్పటికీ కూడా భర్త మాత్రం ఆమెను సాధారణ ప్రసవం కోసమే చూసేవాడని అందుకే ఆమెను 9 నెలల కాలంలో ఒక్క నిమిషం కూడా వదిలి పెట్టలేదని , కనీసం ఇరుగుపొరుగు వారితో కూడా మాట్లాడనిచ్చే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు. షెమీరా బీవీ.. నయాజ్‌కు రెండో భార్య. నెలల నిండిన తర్వాత ఆక్యుపంక్చర్ ద్వారా మొదటి భార్య, ఆమె కుమార్తె సాయంతో ఇంట్లోనే ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించాడు. షెమీరా తండ్రి సైతం తన కుమార్తెను ఆస్పత్రికి వెళ్లొద్దని నయాస్ బెదిరించాడని వాపోయారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక మంత్రి వీణా జార్జీ మాట్లాడుతూ మృతురాలి ఇంటికి గతంలో ఓసారి జిల్లా మెడికల్‌ అధికారి బృందం వెళ్లి వైద్యుల వద్దకు రావాలని సూచించినప్పటికీ వారు ఆక్యుపంక్చర్ వైద్యం తీసుకుంటున్నట్లు భార్యభర్తలు తెలిపినట్లు వివరించారు. సరైన వైద్యం అందకపోవడం వల్లే తల్లీబిడ్డ మరణించినట్లు ఆమె వివరించారు. భర్తను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని, సమాచారం సేకరించి ఇతర చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story