MODI: కులాలకు అతీతంగా పని చేయండి

MODI: కులాలకు అతీతంగా పని చేయండి
ఎన్డీఏ భాగస్వామపక్ష ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు.... త్యాగాలకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టీకరణ...

దేశంలో కుల రాజకీయాలకు అతీతంగా( rise above case-based politics) సమాజంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలని ఎన్డీయే కూటమి( National Democratic Alliance) M.Pలకు ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi‌) దిశా నిర్దేశం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 Lok Sabha elections) కోసం వ్యూహాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఎన్డీయే ఎంపీలతో మోదీ సమావేశమవుతున్నారు.ఇందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలను 11 క్లస్టర్లుగా భాజపా విభజించింది. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 45 మంది ఎంపీలతో పాటు దక్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల ఎంపీలతో మోదీ భేటీ నిర్వహించారు. ఇవాళ ఐదో నంబర్‌ క్లస్టర్‌ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఎంపీల్లో నైతిక స్థైర్యాన్ని పెంచుతున్న మోదీ, 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సమావేశానికి హాజరైన ఎంపీలకు సూచించారు.


ఈ సమావేశంలో 27 మంది బిహార్‌ ఎంపీలతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. నియోజక వర్గ ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలనీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మోదీ ఎంపీలకు సూచించారు. ఎన్డీయేను బలోపేతం చేసేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లేలా పనిచేయాలని ప్రధాని ఎంపీలకు తెలిపారు. బిహార్‌, మహారాష్ట్రల్లో భాజపాకే ఎక్కువ సీట్లు ఉన్నా ప్రాంతీయ మిత్రపక్ష నేతలకే ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేయాలని ఎంపీలను ప్రధాని కోరారు.


క్లస్టర్‌ ఐదు సమావేశం తర్వాత దిల్లీ, హరియాణా, హిమాచల్‌, పంజాబ్‌, చంఢీగఢ్‌, ఉత్తరాఖండ్‌, లద్దాక్‌, జమ్ముకశ్మీర్‌లకు చెందిన క్లస్టర్‌ ఆరులోని 36 మంది ఎంపీలతో ప్రధాని సమావేశమయ్యారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల ఫలాలను ప్రాంతీయ ప్రభుత్వ సహకారం లేకుండానే అందించేలా పనిచేయాలని మార్గదర్శకం చేశారు. త్వరలోనే మిగిలిన క్లస్టర్లకు చెందిన ఎంపీలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు.

ఎంపీలు తమ నియోజకవర్గంపై దృష్టి సారించాలని, ప్రజలతో మమేకం కావాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో ఒక పెద్ద లక్ష్యం కోసం చాలా సార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని, బీజేపీ దానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story