BJP: జగన్‌ ప్రభుత్వం... అవినీతిమయం

BJP: జగన్‌ ప్రభుత్వం... అవినీతిమయం

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి పురందేశ్వరి హాజరయ్యారు. దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోందన్న పురంధేశ్వరి... ఏపీకి సంపూర్ణమైన సహకారాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేందుకు అన్నిరకాల సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో అభివృద్ధి... కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని పురందేశ్వరి వెల్లడించారు. జగన్‌ ప్రభుత్వం అభివృద్ధికి తిలోతకాలు ఇస్తూ... ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన చేస్తోందని ఆమె విమర్శించారు. రోడ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తుంటే... గుంతల రోడ్లు ఉన్నాయన్నారు. గుంతల రోడ్లలో ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నా జగన్‌ సర్కారు పట్టించుకోవట్లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల ఖాతాల్లో పడుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మద్యానికి బానిసైన వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే... వైసీపీ పాలనలో అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.

Next Story